సరిగ్గా 22 ఏళ్ల క్రితం. డిసెంబర్‌ 13. ఉదయం 11.40 నిముషాల సమయం. పార్లమెంట్‌ హౌజ్‌ కాంప్లెక్స్‌లోకి ఓ అంబాసిడర్‌ కార్‌ దూసుకొచ్చింది. ఆ కార్‌కి రెడ్‌ లైట్‌ బిగించి ఉంది. అంతే కాదు. హోమ్‌ మినిస్ట్రీ స్టికర్‌ కూడా ఉంది. అందులో ఐదుగురు ఉగ్రవాదులున్నారు. ఆ స్టికర్‌ని ఫోర్జరీ చేసి అతికించారు. పార్లమెంట్‌ బిల్డింగ్‌ గేట్‌ నంబర్‌ 12 వైపుగా దూసుకెళ్తున్న కార్‌ని చూసి పార్లమెంట్‌ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. సరిగ్గా అదే సమయంలో కార్‌ని చాలా వేగంగా వెనక్కి తిప్పారు. అది కాస్తా అప్పటి ఉపరాష్ట్రపతి కృష్ణ కాంత్‌ వెహికిల్‌ని బలంగా ఢీకొట్టింది. అప్పుడే ఉగ్రవాదులు కార్‌లో నుంచి దిగి కాల్పులకు తెగబడ్డారు. వెంటనే పార్లమెంట్‌ సెక్యూరిటీ అప్రమత్తమైంది. సెక్యూరిటీ అలారం మోగింది. బిల్డింగ్‌ గేట్స్‌ అన్నీ మూసేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో పార్లమెంట్‌ లోపల దాదాపు 100 మంది మంత్రులు, ఎంపీలున్నారు. దాదాపు అరగంట పాటు సెక్యూరిటీ సిబ్బందికి ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మొత్తం 5గురు ఉగ్రవాదులూ ప్రాణాలు కోల్పోయారు. వాళ్లతో పాటు 8 మంది సెక్యూరిటీ సిబ్బందితో పాటు ఓ గార్డెనర్‌ బలి అయ్యారు. 15 మంది గాయపడ్డారు. ఆ సమయంలో ఎల్‌కే అడ్వాణి హోం మంత్రిగా ఉన్నారు. పాకిస్థాన్‌కి చెందిన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌ సంస్థలకు చెందిన ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడ్డారు. ఆ ఐదుగురు ఉగ్రవాదులూ పాకిస్థాన్‌కి చెందిన వాళ్లేనని, భారత్‌తో కొంత మందితో వాళ్లకు సంబంధాలున్నాయని ?అడ్వాణి అప్పట్లో ప్రకటించారు. ఈ ఘటన అప్పుడు మొత్తం దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే ఢల్లీి పోలీస్‌ స్పెషల్‌ సెల్‌ ఈ ఘటనతో సంబంధం ఉన్న నలుగురుని అరెస్ట్‌ చేసింది. వాళ్లలో జమ్ముకశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ మిలిటెంట్‌ మహమ్మద్‌ అఫ్జల్‌ గురుతో పాటు షౌకత్‌ హుసేన్‌ గురు, షౌకత్‌ భార్య అఫ్సన్‌ గురు, అరబిక్‌ యూనివర్సిటీకి చెందిన లెక్చరర్‌ జిలానీ ఉన్నారు. వీళ్లో ఒక్క అఫ్సన్‌కి తప్ప మిగతా ముగ్గురికీ మరణశిక్ష విధించారు. 2003లో గిలానీ నిర్దోషిగా విడుదలయ్యాడు. 2005లో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. షౌకత్‌ హుసేన్‌ గురు ఉరిశిక్షని రద్దు చేసి పదేళ్ల జైలు శిక్ష విధించింది. అఫ్జల్‌ గురుకి మాత్రం ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదు. 2006 సెప్టెంబర్‌ 26న అఫ్జల్‌కి ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 2013 ఫిబ్రవరి 9న ఉరి తీశారు. ఇది జరిగిన 22 ఏళ్లు పూర్తౌెన రోజే మరోసారి పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం బయటపడడం సంచలనం సృష్టించింది. అంత భద్రతను దాటుకుని లోక్‌సభలోకి ఇద్దరు ఆగంతకులు ఎలా దూసుకొచ్చారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మధ్యాహ్నం జీరో అవర్‌ జరిగే సమయంలో ఈ ఘటన జరిగింది. గ్యాస్‌ క్యానిస్టర్స్‌తో ఇద్దరు వ్యక్తులు విజిటర్స్‌ గ్యాలరీలో నుంచి సభలోకి దూసుకొచ్చారు. మైసూరుకి చెందిన సాగర్‌ శర్మ, మనోరంజన్‌ సభలోకి వచ్చినట్టు గుర్తించారు. పార్లమెంట్‌ బయట నీలం, అమోల్‌ శిందే అనే మరో ఇద్దరు వ్యక్తులు నినాదాలు చేశారు.ఇవాళ్టి దాడిని నిషేధిత సిక్‌ ఫర్‌ జస్టిస్‌ అనే సంస్థ చేసిందా అనే అనుమానాలు వస్తున్నాయి. గత కొద్ది రోజుల క్రితమే సిక్‌ ఫర్‌ జస్టిస్‌ నేత, ఖలిస్తాన్‌ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ ఓ వీడియో విడుదల చేశారు. 2001 డిసెంబర్‌ 13వ తేదీన పార్లమెంట్‌ పై దాడి జరిగింది. ఇప్పుడు కూడా అదే రోజు లేదా అంతకు ముందే మేం దాడి చేస్తామన్నది ఆ వీడియో సారాంశం. తనను హత్య చేయడానికి భారతదేశ భద్రతా సంస్థలు కుట్ర పన్నాయని దానికి నిరసనగా పార్లమెంట్‌ పై దాడి చేస్తామని చెప్పారు.గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు కుట్ర జరిగిందని దాన్ని అడ్డుకున్నట్లు అమెరికా నిఘా సంస్థలు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇవాళ్టి దాడి ఖలిస్తాన్‌ ఉగ్రవాదుల పనేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా పార్లమెంట్‌ పై 22 ఏళ్ల క్రితం జరిగిన దాడి రోజే దాడి జరగడం, ఇలా దాడి చేస్తామని గురపత్వంత్‌ సింగ్‌ పన్నూ బెదిరింపు వీడియోను విడుదల చేయడం అన్నట్లుగానే పార్లమెంట్‌ లో ఇద్దరు అగంతకులు ప్రవేశించి ప్రేక్షకుల గ్యాలరీ నుండి పార్లమెంట్‌ లో దూకడం వంటి సంఘటనలు అందరినీ విస్మయపరుస్తున్నాయి. ఎల్లో కలర్‌ గ్యాస్‌ ను పార్లమెంట్‌ లో స్ప్రే చేస్తూ, నినాదాలు చేయడం భద్రతా సంస్థల నిఘా వైఫల్యాన్ని చాటి చెబుతున్నాయి. ఖలిస్తాన్‌ ఉగ్రవాది హెచ్చరికల నేపధ్యంలో ఈ ఇద్దరు అగంతకులు పార్లమెంట్‌ లో ప్రవేశించడం, వారితో పాటు మరో ఇద్దరిని భద్రతా సంస్థలు పార్లమెంట్‌ వెలుపల అదుపులోకి తీసుకున్నాయి. ఆ ఇద్దరి పాత్ర ఏంటి. ఆ అగంతకులు ఖలిస్తాన్‌ ఉగ్రవాదులా, లేకా పాక్‌ ప్రేరిత ఉగ్రవాదులా అన్న చర్చ సాగుతోంది. ఎవరి సాయంతో పార్లమెంట్‌ లోకి ప్రవేశించారన్న అంశంపై కేంద్ర నిఘా సంస్థలు, దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. ఏది ఏమైనా 2001 పార్లమెంట్‌ దాడి తర్వాత మళ్లీ 22 ఏళ్లకు అదే రోజు ఈ దాడి జరగడం మన భద్రతా సంస్థల వైఫల్యంగానే చెప్పాలి. మొత్తం నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సభలో టియర్‌ గ్యాస్‌ ప్రయోగించడం వల్ల ఎంపీలు పరుగులు పెట్టారు. స్పీకర్‌ ఓం బిర్లా వెంటనే సభను రద్దు చేశారు. తరవాత కాసేపటికి మళ్లీ సభ మొదలైంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *