ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. కానీ, దశాబ్ధాలుగా ఆయా శాఖల్లో ఉండే అధికారులు పరిస్థితులను అంచనా వేయలేరా..? సంబంధిత శాఖల ఉన్నతాధికారులకో.. లేదా మంత్రులకో ముందుగానే ప్రమాద హెచ్చరికలపై సమాచారం ఇవ్వాలి కదా..? సరే, వరద విషయంలో వైఫల్యం స్పష్టంగానే ఉందీ.. పోనీ, సహాయక చర్యల్లో అయినా బాధితులకు అందుబాటులో ఉన్నారా అంటే.. ఇక్కడ కూడా అధికారుల అలసత్వం కనిపిస్తుందని బాధితులు వాపోతున్నారు. ఇంతకీ, ఈ విపత్తు నుండి నేర్చుకోవాల్సిన పాఠాలేంటి..?వరదల విలయానికి రెండు తెలుగు రాష్ట్రాలూ అల్లాడాయి. పీకల్లోతు నీళ్లు.. ఎటూ వెళ్లలేని పరిస్థితి. కుండపోత వర్షంలో కుటుంబాలను కాపాడుకోలేని దుస్థితి. నదీ ప్రవాహంలో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారా అన్నట్లు.. ఎటు చూసిన నీటి ప్రవాహం. ఇది ఊహించని పరిణామమే కావచ్చు.. కానీ అంచనా వేయలేని పరిస్థితి కాదన్నది అందరు చెబుతున్న మాట. రెండు రాష్ట్రాల్లోనూ ఆయా శాఖలు, విభాగాలు ఉన్నాయి. వాతావరణ శాఖ నిరంతరం పరిస్థితిని అంచనా వేస్తూ నివేదికలు తయారు చేస్తుంది. వర్షం ఎప్పుడొస్తుందీ..? ఎంత మేరకు వర్షం పడుతుంది..? ఎక్కడెక్కడ జాగ్రత్తలు పాటించాలి..? అనే అంశాలు క్లియర్‌గా ఉంటాయి. అలాగే, నదుల ప్రవాహం, నీటి పరిమాణం, దారి మళ్లింపులు, చెరువులు పరిస్థితులు వంటి విషయాలను పర్యవేక్షించడానికి పలు శాఖలు వాటి అధికారులు ఉంటారు. ముఖ్యంగా వర్షాకాలం వస్తుందంటే సంబంధిత శాఖలు మరింత అప్రమత్తంగా ఉండాలి. మరి ఏం జరిగింది.. ? వీళ్లంతా ఏమై పోయారు..? వాతావరణ శాఖ నివేదికలు తప్పయ్యాయా..? నిపుణులు అంచనా వేయలేదా..? అధికారులు నిర్లక్ష్యం వహించారా..? తప్పు ఎక్కడ జరిగింది..?భారీ వర్షాలు వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 4.5 లక్షల మంది ప్రభావితమయ్యారు. 166 సహాయ శిబిరాలు ఏర్పాటు చేసి.. 30 వేల మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే, ఇలాంటి పరిస్థితుల మధ్య కూడా బాధితులకు సహాయం సరిగ్గా అందట్లేదనే ఆరోపణలు వస్తున్నాయి. వర్షం తగ్గినప్పటికీ వరద కష్టాలు మాత్రం ప్రజల్ని ఇంకా వదిలిపెట్టలేదు. రెండు రోజులు నరకయాతన చూసిన ప్రజలు ఇప్పటికీ తాగడానికి నీళ్లు, తినడానికి ఆహారం కోసం తీవ్రమైన కష్టాలు పడుతున్నారు. కనీసం, సురక్షిత ప్రాంతాలకు వెళ్లడానికి కూడా సహాయక చర్యలు సరిగ్గా అందట్లేదని వాపోతున్నారు.ఈ పరిస్థితిపై ఏపీ సీఎం చంద్రబాబు అధికారుల్ని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో మాదిరిగా ఉంటామంటే కుదరదని వార్నింగ్‌ ఇచ్చారు. మొద్దు నిద్ర వీడాలన్నారు. అధికారుల పనితీరు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా ఉండాలన్నారు. పరిస్థితిని అంచనా వేయలేకపోయారు సరే.. కనీసం, సహాయక చర్యల్లో అయినా నిబద్ధతను చూపించమని అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. బుడమేరు ముంపు ప్రాంతాల్లో డ్యూటీలో ఉన్న అధికారుల తీరును ఎప్పటికప్పడు మంత్రులు పర్యవేక్షించాలని కోరారు. కాగా.. కొంత మంది అధికారులు కావాలనే సహాయక చర్యలకు ఆటంకం కల్పిస్తున్నారని సీఎంకు ఫిర్యాదులు వెళ్లే పరిస్థితికి అధికారులు చేరుకున్నారు. అయితే, ఎవరు డ్యూటీలో ఉండగా సహాయక చర్యల్లో జాప్యం జరుగుతుందో వారిపై సీఎం చంద్రబాబు నివేదిక కోరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జక్కెంపూడిలో ఒక అధికారిని సస్పెండ్‌ చేయగా.. మంత్రుల్ని సైతం ఉపేక్షించేది లేదంటూ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారుప్రతి అధికారీ సహాయక చర్యల్లో పాల్గొనాలని చంద్రబాబు ఆదేశించారు. మానవతా దృక్పథంతో అధికారులు స్పందించాలి అన్నారు. మన కుటుంబసభ్యులే వరదల్లో చిక్కుకుంటే ఎలా రియాక్ట్‌ అవుతామో అలాగే స్పందించాలన్నారు. చనిపోయిన వారి బాడీలను తీయకపోతే.. రేపు మనం చనిపోయినప్పుడు ఎవరు తీస్తారంటూ ప్రశ్నించారు. ఇది తీవ్రమైన సమస్య అని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అధికారులే కాదు, మానవత్వంతో ప్రతి ఒక్కరూ స్పందించాలని అన్నారు. ప్రజల పరిస్థితులను అర్థం చేసుకుంటూ అధికారులు నడుచుకోవాలని సూచించారు.అయితే, ఈ కథ ఇంతటితో ముగిసిందని అనుకోలేని పరిస్థితి. ఎందుకంటే, తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది. సెప్టెంబర్‌ 5న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీని ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల పైన ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఉత్తర అండమాన్‌ సవిూపంలో ఏర్పడనున్న ఈ అల్పపీడనం క్రమంగా తుఫాన్‌గా మారే అవకాశం ఉందని ఈ తుఫాను ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిస్సా తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఒక వాయుగుండం సృష్టించిన విలియం మరవకముందే మరో తుఫాను గండం ముంచుకొస్తున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే, ప్రజలు అప్రమత్తంగా ఉండే మాట అటుంచితే? తాజా వరదలతో పాఠాలు నేర్చుకోవాల్సింది అధికారులేనని ప్రజలు అంటున్నారు.భవిష్యత్తులో ఇంకెప్పుడూ ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యంగా అధికారులపైనే ఉంది. ప్రభుత్వం ఆదేశాలిచ్చేది ఆయా శాఖల అధికారులు ఇచ్చే నివేదికలను బట్టే కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు ముందే మేల్కొనాల్సిన అవసరం ఉంది. వాతరవణ శాఖ హెచ్చరికలను పరిగణలోకి తీసుకుంటూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. రహదారులు పరిరక్షణ, రవాణా సౌకర్యాలు, చెరువుల పర్యవేక్షణ, నదీ ప్రవాహాల అంచనాల విషయంలో ఎలాంటి అలసత్వం వహించినా అది మరింత నష్టానికి దారితీసే పరిస్థితి ఉంటుందని అర్థం చేసుకోవాలి. గత అనుభావాల సమాచారం ఇప్పుడు లేదని చెప్పుకోడానికి అవకాశం ఉన్నా? ఇప్పటి అనుభావాల ప్రభావం ఎలాంటిదో చెప్పే సమాచారం పుష్కలంగా ఉంది. కనీసం, దీన్ని పరిగణలోకి తీసుకొని, రాబోయే రోజుల్లో ఇలాంటి విపత్తును తట్టుకునే ఏర్పాట్లు చేయాలి. దీనికి, ప్రతి అధికారీ నిబద్ధతతో పనిచేయాలి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *