హైదరాబాద్‌, మే 25: : తెలంగాణ వైద్య మండలి అధికారులు పలు క్లినిక్స్‌పై దాడి చేశారు. హైదరాబాద్‌, మేడ్చల్‌ పరిధిలోని ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఐడీపీఎల్‌, చింతల్‌, షాపూర్‌నగర్‌లలో నిర్వహించిన తనిఖీల్లో 50 మంది నకిలీ వైద్యులను గుర్తించారు. 8 మంది సభ్యులు వేర్వేరు బృందాలుగా ఏర్పడి ఒకేసారి తనిఖీలు చేశారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తోన్న పలు క్లినిక్స్‌ను సీజ్‌ చేశారు. కొందరు నకిలీ వైద్యులు ఆరోగ్య కేంద్రాల్లో రోగులను చేర్చుకుని అధికంగా యాంటీ బయాటిక్స్‌ ఇస్తున్నట్లు గుర్తించారు. తాము వైద్యులుగా పేర్కొంటూ బోర్డు పెట్టుకోవడమే కాక, వారికి అనుసంధానంగా మెడికల్‌ షాపులు, డయాగ్నొస్టిక్‌ సెంటర్లు కూడా పెట్టుకున్నారని అధికారులు తెలిపారు. దాదాపు 50 మంది నకిలీ వైద్యులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, ఇద్దరిని జైలుకు పంపినట్లు వెల్లడిరచారు. తనిఖీల్లో డాక్టర్‌ ప్రతిభాలక్ష్మి, డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌, డాక్టర్‌ సన్నీ డేవిస్‌, డాక్టర్‌ ఇమ్రాన్‌ అలీ, డాక్టర్‌ కే. విష్ణు, పాండు తదితరులు పాల్గొన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నకిలీ వైద్యులు, క్లినిక్స్‌ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచించారు.మరోవైపు, తప్పుడు ప్రకటనలతో ఔషధాలు తయారు చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇస్తోన్న తయారీ సంస్థలపైనా తెలంగాణ ఔషధ నియంత్రణ శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు. ఈ నెల 23, 24 తేదీల్లో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించిన అధికారులు.. కొన్ని చోట్ల సోదాల్లో నకిలీ ఔషధాలు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా గండిపేటలో న్యూమోనియాకు ఆయుర్వేద ఔషధం పేరుతో తయారు చేస్తోన్న ఓ ఆయిల్‌, నిజామాబాద్‌లో మధుమేహానికి ఆయుర్వేద ఔషధం పేరుతో ఉసిరి జ్యూస్‌ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పలు సంస్థలు తమ లేబుళ్లపై న్యూమోనియా, డయాబెటిస్‌ చికిత్స కోసం పని చేస్తాయని విక్రయిస్తున్నట్లు తెలిసి చర్యలు చేపట్టారు. ప్రజలు ఇలాంటి ఔషధాల పట్ల అలర్ట్‌గా ఉండాలని సూచించారు. ఇలాంటి ఔషధాల విక్రయాలకు సంబంధించి టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1800`599`6969కు ఫిర్యాదు చేయాలని డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు సూచించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *