లక్నో నవంబర్ 17: సంతానం కలుగని దంపతులకు మైనర్ బాలికల నుంచి సేకరించిన అండాలు అమ్ముతున్నారు. పేదింటి బాలికలకు డబ్బులు ఆశ చూపించి ఈ చర్యకు పాల్పడుతున్నారు. ఒక మహిళ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఈ సంఘటన జరిగింది. సంతానం కోసం ఐవీఎఫ్ సెంటర్కు వచ్చే జంటలకు మైనర్ బాలికల అండాలు విక్రయిస్తున్నట్లు 17 ఏళ్ల బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. డబ్బుతో అమ్మాయిలను ఎరగా వేసి వారి వయస్సుకు సంబంధించిన నకిలీ పత్రాలు సృష్టిస్తున్నారని ఆరోపించింది. బాలిక అండాల కోసం రూ.30,000 ఇస్తామని చెప్పి కేవలం రూ.11,500 చెల్లించాలని ఫిర్యాదులో పేర్కొంది.కాగా, వారణాసి పోలీసులు దీనిపై దర్యాప్తు జరిపారు. నవపుర ప్రాంతానికి చెందిన సీమా దేవి, ఆమె భర్త ఆశిష్ కుమార్, ఖోంజ్వాన్ ప్రాంతానికి చెందిన అనితా దేవి, సోన్భద్రకు చెందిన అన్మోల్ జైస్వాల్ను అరెస్టు చేశారు. ఐవీఎఫ్ సెంటర్ సిబ్బంది, డాక్టర్లకు ఈ వ్యవహారంతో సంబంధం ఉందని ఆరోపించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడిరచారు.మరోవైపు నిబంధనల ప్రకారం అండం దానం చేసే మహిళ వయసు 23 ఏళ్లకు మించి ఉండాలి. ఆమెకు పెళ్లి కావడంతో పాటు మూడేళ్లకు పైగా వయస్సున బిడ్డ ఉండాలి. అలాగే ఒక మహిళ జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే అండం దానం చేసేందుకు అర్హురాలని పోలీస్ అధికారి తెలిపారు.