తిరుపతి, మార్చి 25: టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే మహిళల ఆదాయం రెట్టింపు చేసి చూపిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సోమవారం కుప్పంపర్యటనలో భాగంగా ఆయన మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. దేశం గర్వించేలా కుప్పం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు. వైసీపీ హయాంలో చీకటి వ్యాపారాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. ‘డబ్బుకు కక్కుర్తి పడి విదేశాల నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చి అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. టీడీపీ హయాంలో అక్రమార్కులు రాష్ట్రంలోకి రావడానికే భయపడ్డారు. అలాంటిది ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉందా.?’ అంటూ నిలదీశారు.అవసరమైతే ఆడబిడ్డల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని చంద్రబాబు తెలిపారు. దేశంలో ఆడబిడ్డల గురించి మాట్లాడిన తొలి పార్టీ టీడీపీ అని.. వారికి ఆస్తిలో సమాన హక్కులు కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని గుర్తు చేశారు. ‘తల్లిదండ్రులు ఆస్తి ఇవ్వకపోతే పోరాడి మరీ కోర్టుకు వెళ్లి తెచ్చుకునే హక్కు కల్పించారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, డ్వాక్రా సంఘాల ఏర్పాటుతో మహిళల్లో చైతన్యం తీసుకొచ్చాం. మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం ఇవ్వాలని ఆలోచన చేసిందే టీడీపీ. 2 కోట్ల మంది మహిళలకు హావిూ ఇస్తున్నా. మహిళల ఆదాయం రెట్టింపు చేస్తాం. జగన్‌ లా రూ.10 ఇచ్చి రూ.100 లాగడం కాదు. సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచుతాం. అధికారంలోకి వస్తే ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 అకౌంట్‌ లో వేస్తాం’ అని హావిూ ఇచ్చారు. మహిళలు ఆర్థికంగా పైకి రావాలంటే ఇంటికి 2 ఆవులు ఇవ్వాలనుకున్నామని.. అప్పుడు దీనిపై అవహేళన చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. కుప్పంలో వెయ్యి లీటర్లతో ప్రారంభమైన పాల సేకరణ.. ఇప్పుడు 4 లక్షల లీటర్లకు చేరుకుంది. ఆడబిడ్డల ఆత్మగౌరవం కోసం ఇంటింటికీ మరుగుదొడ్లు కట్టించామని అన్నారు. రాష్ట్రంలో నాసిరకం మద్యం అమ్ముతూ ఆడబిడ్డల మంగళసూత్రాలను వైసీపీ ప్రభుత్వం తెంచేస్తోందని విమర్శించారు. జగన్‌ పాలనలో రూ.60 మద్యం ధర రూ.200 అయ్యిందని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వస్తే తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తామని అన్నారు. కుప్పంలో రాళ్లు, మట్టిని కూడా అమ్ముకుంటున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నది కౌరవ సభ అని.. దానిని గౌరవ సభ చేశాకే మళ్లీ అక్కడ అడుగు పెడతామని అన్నారు. కుప్పంలో లక్ష మెజార్టీ సాధించేందుకు టీడీపీ కార్యకర్తలు కృషి చేయాలని.. అందరిదీ అదే లక్ష్యం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వైసీపీకీ ఓటు వేయాలని అడిగిన వారికి కర్రు కాల్చి వాత పెట్టాలని ధ్వజమెత్తారు. 75 శాతం ఓట్ల పడేలా కృషి చేయాలని సూచించారు. చంద్రబాబు రెండు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం కుప్పం చేరుకున్న ఆయనకు టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన కొత్తపేటలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం, పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందించి వేదాశీర్వచనం అందించారు. మరోవైపు, పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్ద ఆయన వాహనాన్ని పార్టీ శ్రేణులు చుట్టుముట్టాయి. పరిసరాల్లో అంతగా పోలీసులు లేకపోవడంతో మహిళలతో ముఖాముఖిలో పాల్గొనేందుకు చంద్రబాబు వాహనం దిగి వెళ్లగా ఇబ్బంది పడ్డారు. పరిసరాల్లో అంతగా పోలీసులు లేరని.. అతి సాధారణ భద్రత కల్పించడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *