ఏపీఐఐసీ పరిశ్రమలు ఆదిత్య బిర్లా, హెల్లాన్ఫ్ఫ్రా, విసిఐసి స్టార్ట్ అప్ ఏరియా కు భూమి పూజ
శిలా ఫలకాలను వర్చువల్ విధానంలో ఆవిష్కరించిన పరిశ్రమల శాఖ మంత్రి
పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది:శ్రీకాళహస్తి ఎమ్మెల్యే
తిరుపతి:రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తోందని సింగిల్ విండో ఏర్పాటుతో పరిశ్రమలకు కావాల్సిన అనుమతులను సకాలంలో అందజేస్తూ పారిశ్రామిక వేత్తలకు తోడ్పాటునిస్తూ యువతకు ఉపాధి కల్పించే దిశలో అనేక చర్యలు చేపడుతోందని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు.
బుధవారం ఉదయం పరిశ్రమల శాఖ, విజయవాడ సచివాలయం నుండి పరిశ్రమల శాఖ మంత్రి రాష్ట్రంలోని పలు నూతన పరిశ్రమలకు శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలు వివిధ పారిశ్రామిక వేత్తలతో, సంబంధిత కార్యదర్శులు, అధికారులతో కలిసి వర్చువల్ విధానంలో చేపట్టగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రతాప్ రెడ్డి, ఏపీఐఐసి జడ్ఎం చంద్ర శేఖర్, తిరుపతి స్పెషల్ జోన్ అధికారి విజయ రత్నం, సంబంధిత పరిశ్రమల ప్రతినిధులతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ మంత్రి మాట్లాడుతూ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 నిర్వహించడం ద్వారా పలు ఎంవోయూ లు చేసుకుని ప్రాజెక్టులు వివిధ దశలలో ఉన్నాయని తెలిపారు. నేడు పలు పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల భూమి పూజ శిలాఫలకాల ఆవిష్కరణ, ప్రారంభం వర్చువల్ గా చేపట్టడం జరిగిందని పారిశ్రామిక వేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో నాయుడుపేట స్పెషల్ జోన్ నందు ఆదిత్య బిర్లా గ్రూప్ వారు రూ.1198 కోట్లతో ఏర్పాటు చేయబోతున్న కార్బన్ బ్లాక్ తయారీ యూనిట్ ద్వారా 250 మందికి ఉపాధి కలగనున్నదని, హెల్లాన్ఫ్ఫ్రా మార్కెట్ ప్రైవేట్ లిమిటేడ్ వారు రూ.350 కోట్లతో ఏర్పాటు చేయబోతున్న కంపెనీ ద్వారా పివిసి పైప్స్ మరియు ఫిట్టింగ్స్ తయారీ ద్వారా 350 మందికి ఉపాధి కలగనున్నదని, అలాగే వైజాగ్ చెన్నై కారిడార్ శ్రీకాళహస్తి ` చిత్తూరు సౌత్ క్లస్టర్ స్టార్ట్ అప్ ఏరియా ప్రాజెక్ట్ విలువ రూ. 423 కోట్లతో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, పవర్ సప్లై తదితర ఏర్పాటుతో అభివృద్ధి పరచడం కొరకు భూమి పూజ శిలా ఫలకాల ఆవిష్కరణ మంత్రి గారు వర్చువల్ విధానంలో భూమి పూజ చేశారని ఇది ఎంతో హర్షణీయం అని తెలిపారు. ఎంఎస్ఎంఈ లకు ఎప్పటికీ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పరిశ్రమల ప్రతినిధులు, తదితర అధికారులు పాల్గొన్నారు.