విజయవాడ, డిసెంబర్‌ 13: వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో ఒక్కసారిగా అలజడి. ఒకేసారి 11 నియోజకవర్గాలకు ఇన్‌ చార్జులను మార్చేశారు. తిరుగులేని జనాదరణతో 151సీట్లతో 2019లో అధికారాన్ని చేజిక్కించుకున్న తమకు 2024లో ఎదురేముంది అనకుంటున్న నేతలకు ఒక్కసారిగా కుదుపు. ఉన్నట్టుండి ఇంత మందిని మార్చేస్తారా అని వాళ్లు అనుకుంటున్నారు. కానీ ఇది జస్ట్‌ శాంపిల్‌ మాత్రమే. అసలు సంగతి ముందుంది. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు.. మొత్తం 65 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు మారబోతున్నారు. రెండు`మూడు జిల్లాలకే 11మందిని మార్చేస్తే.. మిగిలిన చోట్ల పరిస్థితి ఏంటన్న ఆందోళన ఇప్పుడు ఎమ్మెల్యేల్లో మొదలైంది. ఇచ్చాపురం మొదలుకుని కుప్పం వరకూ పార్టీ నేతల్లో టెన్షన్‌ మొదలైంది. ఎవర్‌ ఇన్‌.. ఎవరు అవుట్‌.. ఎవరికి ట్రాన్సఫ అన్న చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. మార్చడమైతే ఖాయమన్న మెసేజ్‌ ఇప్పటికే ఎమ్మెల్యేలకు అంతర్గతంగా వెళ్లిపోయింది. అందుకే కొంతమంది సైలంట్‌ గా ఉంటే.. మరి కొంత మంది పక్క చూపులు చూస్తున్నారు. పార్టీలోని ముఖ్యుల నుంచి అందిన సమాచారం మేరకు 65 స్థానాల్లో అభ్యర్థులు మారుతుతున్నారు. ఇందులో 40 మందిని పూర్తిగా పక్కన పెడుతుండగా.. మరో 25చోట్ల జంబ్లింగ్‌ చేయబోతున్నారు. వైస్సార్సీపీ అధినేత జగన్‌మోహనరెడ్డి కోసం ఐపాక్‌ టీమ్‌ పనిచేస్తున్న విషయం తెలిసిందే కదా.. ఈ సంస్థ గ్రౌండ్‌ లెవల్‌లో చేసిన సర్వేల్లో పార్టీ పరిస్థితి బాగాలేదన్న రిపోర్టు వచ్చింది. కనీసం 70స్థానాల్లో ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలింది. ఐదు చోట్ల స్థానికంగా ఉన్న గొడవలను సర్దుబాటు చేసి మిగిలిన 65చోట్ల అభ్యర్థులను మార్చాలన్న నిర్ణయానికి జగన్‌ వచ్చేశారు. ఈ నిర్ణయం జరిగి కూడా నెలరోజులకు పైగానే అవుతోంది. కొంతమంది ఎమ్మెల్యేలకు ఈ మెసేజ్‌ను ఎప్పుడో చేరవేశారు కూడా.. విడతల వారీగా ఇప్పుడు.. అభ్యర్థులను మారుస్తూ వస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో :
ధర్మాన బ్రదర్స్‌ కు మళ్లీ టికెట్లు దక్కే అవకాశం ఉంది. అయితే ధర్మాన మాత్రం తాను రాజకీయాల నుంచి విరమిస్తానని కుమారుడికి అవకాశం ఇమ్మని చెబుతున్నారు. టెక్కలి టికెట్‌ కోసం కిల్లి కృపారాణి మంతనాలు చేస్తున్నారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాం విషయంలో వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకోలేకపోతోంది. ఆయన నియోజకవర్గంలో వ్యతిరేకత ఉందని.. అలాగని మరో అభ్యర్థిని అక్కడ పెట్టే అవకాశం కూడాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
విజయనగరం జిల్లాలో..
బొత్స సత్యనారాయణను ఎంపీగా పంపించాలనే యోచన ఉంది. బొబ్బిలి, ఎస్‌కోటలో అభ్యర్థులను మార్చాలన్న డిమాండ్‌ ను పరిశీలిస్తున్నారు.
విశాఖ జిల్లాలో
విశాఖ జిల్లాలో చాలా మార్పులు జరగబోతున్నాయి. నియోజకవర్గ సమన్వయ కర్తగా తొలగించడంతో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు పార్టీకి రాజీనామా చేశారు. మళ్లీ అలాంటిదేవిూ లేదన్నారు. అక్కడ వరికూటి రామచంద్రరావుకు బాధ్యతలు ఇచ్చారు. మంత్రి అమరనాథ్‌కు అప్పగించాలని చూసినా ఆయన ఆసక్తి చూపలేదు. అమరనాథ్‌ను పెందుర్తి నుంచి నిలబెట్టబోతున్నారు. అనకాపల్లి నుంచి ఎంపీ సత్యవతికి టికెట్‌ ఇచ్చే అవకాశం ఉంది. అరకు స్థానానికి కూడా అభ్యర్థిని మారుస్తున్నరు.
ఉమ్మడి తూర్పు గోదావరిలో
మంత్రి చెల్లుబోయినకు టికెట్‌ లేదన్న విషయాన్ని ఇప్పటికే కన్ఫామ్‌ చేశారు. ఆయనను ఎమ్మెల్యేగా ఎక్కడా నిలబెట్టే పరిస్థితి లేదు. రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని పార్టీ కోరుతోంది. రాజమండ్రి ఎంపీ భరత్‌ను రాజమండ్రి అర్బన్‌ అసెంబ్లీ నుంచి పోటీ చేయించాలన్న ఆలోచనలో ఉన్నారు. మాజీమంత్రి కన్నబాబును కూడా కాకినాడ ఎంపీ స్థానం నుంచి పోటీచేయాలని చెబుతున్నారు. అమలాపురం ఎంపీ అనురాథకు అమలాపురం అసెంబ్లీ స్థానం దక్కే అవకాశం ఉంది. కాకినాడ ఎంపీ వంగా గీతకు పిఠాపురం సీటు కేటాయించనున్నారు. కోనసీమ నుంచి మంత్రిగా ఉన్న విశ్వరూప్‌ ను పక్కన పెడుతున్నారు. ఆయన కుమారుడుకి విశాఖ జిల్లా పాయకరావుపేట సీట్‌ కేటాయించే అవకాశాన్ని చూస్తున్నారు.
వెస్ట్‌ గోదావరిలో
పశ్చిమ గోదావరిలో పార్టీ పరిస్థితి బాగా లేదన్న విషయాన్ని పార్టీ గుర్తించింది. నర్సాపురం పార్లమెంట్‌ స్థానంలోని అన్ని అసెంబ్లీ సీట్లలో ఇబ్బందికర పరిస్థితే ఉంది. ఇక్కడ చాలా మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. లేదా ఎలాగూ గెలవరు అని తెలిస్తే.. పాత వాళ్లని కొనసాగించొచ్చు. మాజీమంత్రి ఆళ్ల నానికి కూడా ఏలూరులో ప్రత్యామ్నాయాన్ని చూస్తున్నారు.
కృష్ణా జిల్లాలో
కృష్ణా జిల్లాలో మల్లాది విష్ణు, వెల్లంపల్లి కి సీట్లు కష్టమే. జోగి రమేష్‌ కు కూడా ఎమ్మల్యే సీటు లేదని చెప్పేసినట్లు సమాచారం. ఆయన్ను ఏలూరు నుంచి ఎంపీగా పోటీ చేయించాలన్న ఆలోచనతో ఉన్నారు. ఇక తెలుగుదేశం నుంచి వచ్చిన ఫైర్‌ బ్రాండ్‌ లీడర్‌ గన్నవరం వంశీ కొంతకాలంగా సైలంట్‌ అయిపోయారు. ఆయనకు సీటు లేదని చేప్పడమే కారణమట. పెనమలూరు నుంచి పార్థసారథిని గన్నవరం తెచ్చి.. వంశీని పెనమలూరు వెళ్లాలని చెప్పినట్లు సమాచారం. వంశీ యాక్టివ్‌గా లేకపోవడానికి ఇదే కారణమని భావిస్తున్నారు.
గుంటూరుజిల్లాలో
గుంటూరులో మంత్రి విడుదల రజనీని చిలకలూరిపేట నుంచి గుంటూరు వెస్ట్‌కు తీసుకొచ్చారు. అయితే చివరి నిమిషం వరకూ అది కూడా డౌటే అంటున్నారు.. పేటలో తీవ్ర వ్యతిరేకత ఉండటంతో తాత్కాలికంగా వెస్ట్‌ కు తీసుకొచ్చినట్లు చెబుతున్నా.. అది జస్ట్‌ స్టేజింగ్‌ మాత్రమే. ఇప్పటికే రేపల్లె, వేమూరు, ప్రత్తిపాడు, తాడికొండ, చిలకలూరిపేట, మంగళగిరి, గుంటూరు వెస్ట్‌ స్థానాలకు అభ్యర్థులను మార్చేశారు. పొన్నూరు, పెదకూరపాడు, సత్తెనపల్లి కూడా మార్చే అవకాశాలున్నాయి. అంబటికి ఆల్రెడీ చెప్పేసినట్లు చెప్పుకుంటున్నారు.
ప్రకాశం జిల్లాలో
ప్రకాశం జిల్లాలో వైసీపీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది. వైవీ సుబ్బారెడ్డి ఇన్‌చార్జిగా ఉన్నప్పుడు.. ఇబ్బందులు ఉన్నాయనుకుంటే.. విజయసాయిరెడ్డి వచ్చాక పరిస్థితి మరింత జఠిలంగా మారిపోయిందంట. తెలుగుదేశం వాళ్లంతా కలిసికట్టుగా పనిచేస్తుంటే.. ఇక్కడ వైసీపీ మాత్రం తలో దిక్కు అయిపోయింది. బాలినేని పూర్తిగా దూరంగా జరగడం.. ఎన్నికల టైమ్‌ కు ఏం చేస్తారో తెలీక పోవడంతో ఇక్కడ పరిస్థితి అర్థం కావడం లేదు. ఇపప్టికే అద్దంకి, సంతనూతలపాడు, కొండేపి సీట్లలో మార్పులు జరిగాయి.
నెల్లూరు జిల్లాలో
నెల్లూరు జిల్లాలో అనిల్‌ కు టికెట్‌ లేదన్న విషయం కన్ఫామ్‌ చేసేశారు. గూడురు ఎమ్మల్యే వరప్రసాద్‌, కావలి సీట్లలో కూడా మార్పులు జరుగుతున్నాయి. చివరి నిమిషంలో మరిన్ని మార్పులు ఉండబోతున్నాయి.
ఉమ్మడి చిత్తూరులో
చిత్తూరు జిల్లాలో స్థానికంగా వ్యతిరేకత ఎదుర్కొంటున్న రోజాను పక్కన పెట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆమెను పార్టీ ప్రచారకర్తగా వాడుకోవాలనుకుంటున్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యేను మార్చడం ఖాయం. ఆయన స్థానంలో రోజా అభ్యర్థిత్వాన్ని పరిశీలించే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎంకు నారాయణస్వామికీ టికెట్‌ నిరాకరిస్తున్నారు. పూతలపట్టు, సత్యవేడు, మదనపల్లి ఇలా అన్ని చోట్లా కాండిడేట్లు మారిపోతున్నారు.
అనంతపూర్‌లో:
అనంతపురం జిల్లాలో మంత్రి ఉషశ్రీ చరణ్‌ కు సీటు ఇవ్వడం లేదు. ఎమ్మెల్యే తిప్పేస్వామికి నో చెప్పేశారు. కదిరిలోనూ మార్పు ఉంటుంది.
కడపలో కీలక మార్పులు
సీఎం సొంత జిల్లా కడపలో ఆయన మేనమామ రవీంద్రనాథ్‌ రెడ్డికి నో అనేశారు. జమ్మలమడుగు , డిప్యూటీ సీఎం అంజాద్‌ భాషా ప్రాతినిధ్యం వహిస్తున్న కడప అర్బన్‌ సీట్లలోనూ కాండిడేట్లు మారిపోతారు. జమ్మల మడుగు నుంచి అవినాష్‌ పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఆయన కాని పక్షంలో మరొకరికి సీటు ఇస్తారు.
కర్నూలు జిల్లాలో:
కర్నూలు జిల్లాలో మంత్రి జయరాంకు సీటు లేదన్న విషయాన్ని స్పష్టం చేశారు. ఆరోపణలు ఎన్ని ఉన్నా.. ఆ సామాజిక వర్గం నుంచి కాండిడేట్లు లేరన్న కారణంతో కొనసాగించారు. ఈసారి ఎమ్మెల్యే టికెట్‌ కూడా నిరాకరిస్తున్నారు. అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను కర్నూలుకు రప్పించే అవకాశం ఉందిమొత్తం విూద 65 స్థానాల్లో అభ్యర్థులు మారడం అనేది మాత్రం పక్కా. ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించినందున ముందు ముందు ఇలాంటి లిస్టులు మరిన్ని బయటకు వచ్చే అవకాశం ఉంది. మార్పులకు కారణం ఏంటో పార్టీ నేతలే నేరుగా చెబుతున్నందున దీనిపై పెద్దగా చర్చ కూడా ఏం లేదు. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను మారుస్తున్నామని చెబుతున్నారు కాబట్టి.. పాత అభ్యర్థులతో వెళితే ఈ సీట్లలో ఓడిపోతారని అర్థం చేసుకోవాలి. అయితే ఈ మార్పులు వైస్సార్సీపీలో కాస్త అలజడిని సృష్టిస్తున్నాయి. మంగళగిరి టికెట్‌ నిరాకరించడంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చెప్పేశారు. సీటు వస్తుందని ఆశించిన డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ఇప్పుడు బయట పార్టీవైపు చూస్తున్నారు. సీనియర్‌ ఎమ్మెల్యే సుధాకరబాబునూ పక్కన పెట్టేశారు. చాలా మంది మంత్రులను పక్కన పెడుతున్నా.. వాళ్లంతా జగన్‌ కు సన్నిహితులు కావడంతో ఏం అనలేని పరిస్థితి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *