విజయవాడ, మే4 :ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు గతంలో ఎప్పుడూ లేని టెన్షన్‌కు కారణమవుతున్నాయి. ఎప్పుడు ఎలాంటి వివాదం తెరపైకి వస్తుందో ఎవరు ఎవరిపై ఫిర్యాదులు చేసుకుంటారో అనే ఉత్కంఠ మాత్రం అందరిలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు సైతం తీసుకునే పరిస్థితి ఉందని గ్రహించిన ఎన్నికల సంఘం కొన్ని నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అలాంటి వాటిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం కూడా ఉంది.
ఎన్నికల టైంలో కొట్లాటలు, హింస్మాత్మక ఘటనలు అంటే ఠక్కున గుర్తుకు వచ్చే ప్రాంతం పల్నాడు, తర్వాత రాయలసీమ. ఈ రెండిరటిలో పల్నాడు ప్రాంతంలో పరిస్థితి మరింత సెన్సిటివ్‌గా ఉంటాయి. ప్రచార సమయంలోనే అక్కడ పరిస్థితి చాలా వైలెంట్‌గా ఉంది. అలాంటిది పోలింగ్‌ రోజు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకే ఆప్రాంతాన్ని సమస్యాత్మక జోన్‌గా చెబుతున్న ఈసీ కొన్ని నియోజకవర్గాలపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. పల్నాడులోని మాచర్ల(, వినుకొండ గురజాల, పెదకూరపాడు నియోజకవర్గాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించింది. అందుకే అక్కడ ప్రతి పోలింగ్‌ కేంద్రంలో వెబ్‌ కాస్టింగ్‌ ఉండాలని ఏర్పాటు చేస్తోంది. అదే టైంలో సీఆర్‌పీఎఫ్‌ బలగాలను కూడా భారీ సంఖ్యలో మోహరించేందుకు సిద్ధమవుతోంది. అలాంటి సమస్యలు ఉన్న నియోజవర్గాల జాబితాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రస్తుతం పోటీ చేస్తున్న పుంగనూరు కూడా ఉంది. ఈ నియోజక వర్గం ఆది నుంచి వివాదాలకు కేంద్రంగా ఉంటూ వస్తోంది. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ఇక్కడ పరిస్థితులు నిప్పులు రాజేస్తున్నాయి. మంత్రి పెద్ది రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేసే పరిస్థితి లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆరు నెలల క్రితం చంద్రబాబు ప్రచారానికి వెళ్లనీయకుండా పోలీసులే అడ్డుకోవడం.. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ప్రజల కళ్లముందు కదులుతూనే ఉన్నాయి. అదే ప్రాంతంలో ఉంటూ బీసీవైపీ పేరుతో పార్టీని స్థాపించి రాజకీయం చేస్తున్న రామచంద్రయాదవ్‌పై కూడా పలు మార్లు దాడులు జరిగాయి. గత వారంలో కూడా ఆయన్ని ఆయన అనుచరులను టార్గెట్‌ చేస్తూ కొందరు వీరంగం సృష్టించారు. ఈ దాడులు, కవ్వింపు చర్యలు, హింస వెనుక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రేపు పోలింగ్‌ రోజు ఇది మరింత పెచ్చువిూరే ఛాన్స్‌ ఉందని గ్రహించిన ఈసీ ఆ నియోజకవర్గాన్ని కూడా సమస్యాత్మక జాబితాలో పెట్టింది. దీంతో అక్కడ కూడా అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌తోపాటు భారీగా బలగాలను మోహరించనున్నారు. కొన్నేళ్ల నుంచి ఎన్నికల సమయంలో ఆ ముందు ఆ తర్వాత జరుగుతున్న హింసాత్మక ఘటనల లెక్కలు తీసుకొని ఎన్నికల సంఘం మొత్తం 14 నియోజకవర్గాలను సమస్యాత్మకంగా గుర్తించింది. అలాంటి వాటిలో పైన చెప్పిన మాచర్ల, వినుకొండ, గురజాల, పెద్దకూరపాడు, పుంగనూరుతోపాటు ఒంగోలు, ఆళ్లగడ్డ, తిరుపతి, చంద్రగిరి, విజయవాడ సెంట్రల్‌, పలమనేరు, పీలేరు, రాయచోటి తంబళ్లపల్లెను చేర్చింది. ఇందులో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఎక్కువ ఉన్నాయి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *