న్యూ డిల్లీ అక్టోబర్‌ 18:బియ్యం ఎగుమతుల విషయంలో కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని మరో ఏడు దేశాలకు ఎగుమతి చేసేందుకు అనుమతించింది. దేశంలో నాన్‌ బాస్మతి తెల్ల బియ్యం కొరతను నివారించేందుకు, ఆ బియ్యం ధరలను అదుపు చేసేందుకు కేంద్రం గత జూలైలో వాటి ఎగుమతులపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే, నేపాల్‌ , మలేషియా ఫిలిప్పీన్స్‌ , సీషెల్స్‌, కామెరూన్‌, ఐవొరీ కోస్ట్‌, రిపబ్లిక్‌ ఆఫ్‌ గినియా దేశాలకు బాస్మతీయేతర బియ్యాన్ని వివిధ పరిణామాలతో ఎగుమతి చేయడానికి తాజాగా కేంద్రం అనుమతించింది.నేషనల్‌ కోపరేటివ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌, ది డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ల ద్వారా మాత్రమే బియ్యం ఎగుమతులకు అనుమతిస్తూ కేంద్రం బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏడు దేశాలకు 10,34,800 టన్నుల నాన్‌ బాస్మతి రకం తెల్ల బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు కేంద్రం సమ్మతించింది.నేపాల్‌కు 95,000 టన్నులు, కామెరూన్‌కు 1,90,000 టన్నులు, ఐవొరీ కోస్ట్‌కు 1,42,000 టన్నులు, రిపబ్లిక్‌ ఆఫ్‌ గినియాకు 1,42,000 టన్నులు, మలేషియాకు 1,70,000 టన్నులు, ఫిలిప్పీన్స్‌కు 2,95,000 టన్నులు, సీషెల్స్‌కు 800 టన్నుల తెల్లబియ్యం ఎగుమతులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కాగా, అంతకుముందు యూఏఈ, సింగపూర్‌ దేశాలకు కూడా బాస్మతీయేతర తెల్లబియ్యం ఎగుమతి చేసేందుకు భారత్‌ అనుమతించిన విషయం తెలిసిందే.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *