అల్వాల్:తన భార్య నుండి తనకు , తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని … రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకున్నారు. పెళ్ళైనప్పటి నుండి తనను మానసికంగా , శారీరకంగా హింసిస్తుందని బాధితుడు టెమూజియన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆల్వాల్ పోలీస్ స్టేషన్ ముందు ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో ఒంటిపై భార్య చేసిన గాయాలను చూపిస్తూ , విూడియాతో తన గోడును చెప్పుకున్నాడు. ఏపీ రాజోలు కు చెందిన టెమూజియన్ కు అమలాపురం కు చెందిన లక్ష్మీ గౌతమితో ఏడేళ్ల క్రితం పెళ్లి జరిగినట్లు తెలిపాడు. మల్లారెడ్డి కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ చేస్తూ , భార్యతో కలిసి అల్వాల్ లో నివాసం ఉంటున్నట్లు వివరించాడు. తమకు ఐదేళ్ల కొడుకు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే పెళ్లైనప్పటి నుండి తనను అకారణంగా హింసిస్తుందని తెలిపాడు. పలుమార్లు పెద్దవాళ్ళ సమక్షంలో మాట్లాడిన ఆమె తీరు మారలేదన్నారు. ఇటీవల తనను చంపేందుకు కత్తితో దాడి చేసినట్లు తెలిపాడు. ఈ విషయంపై స్థానిక అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని… అయితే పోలీసులు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. మహిళలకు ఒక చట్టం , పురుషులకు ఒక చట్టం ఉంటుందా అని ప్రశ్నించారు. తాను నిన్నటి నుండి ఇంటికి వెళ్లలేదని , వెళ్తే తన భార్య మళ్ళీ దాడి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశాడు. పోలీసులు తన భార్యపై కేసు నమోదు చేసి , తనకు రక్షణ కల్పించాలని బాధిత భర్త వేడుకున్నాడు.