విజయవాడ, నవంబర్‌ 29: తెలంగాణలో ప్రచారపర్వం ముగిసిపోయింది. ఖేల్‌ ఖతమ్‌.. దుకాణ్‌ బంద్‌. మరి.. ఏపీ పరిస్థితేంటి..? అటు నుంచి కూడా ఎన్నికల హీట్‌ మొదలైపోయింది. ఎన్నికల తేదీలు ఫలానా అంటూ ఊహాగానాలు ఊపందుకోవడంతో పొలిటికల్‌ పార్టీలకు టెంపరేచర్లు పెరిగిపోతున్నాయి. ఏపీలో సడన్‌గా మారిన ఈ వాతావరణానికి అసలు కారణం మరెవరో కాదు.. స్వయాన ఎలక్షన్‌ కమిషనే!2019లో అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఏప్రిల్‌ 11న ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. మార్చి 18న నోటిఫికేషన్‌, ఏప్రిల్‌ 11న పోలింగ్‌, మే 23న కౌంటింగ్‌. ఇలా పోలింగ్‌కి, ఫలితానికి దాదాపు 40 రోజులు గ్యాప్‌ ఉండడంతో అప్పటి ఉత్కంఠ ఏ రేంజ్‌లో నడిచిందో ఇప్పటికీ గుర్తుంది. మరి, ఈసారి ఏపీలో ఎన్నికల ప్రక్రియ ఎలా ఉండబోతోంది..? ఈ క్లారిటీ ఐతే లేదు గానీ, ఎన్నికల తేదీలపై రూమర్లు మాత్రం ఓ రేంజ్‌లో షురూ అయ్యాయి. ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌, మార్చిలో ఎన్నికలు అంటూ ఒక తేదీ, ఏప్రిల్‌లో నోటిఫికేషన్‌, మేలోగా ఎన్నికలు అంటూ మరిన్ని డేట్స్‌ ప్రచారంలో ఉన్నాయి.అప్పుడే ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా ఎలక్టోరల్‌ అబ్జర్వర్లను నియమించింది ఎలక్షన్‌ కమిషన్‌. 2024 స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ రూపకల్పన తనిఖీ కోసం అయిదుగురు సీనియర్‌ ఐఏఎస్‌లను అబ్జర్వర్లుగా నియమిస్తూ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌ కుమార్‌ విూనా ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆకస్మిక ఆదేశాలతోనే ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైంది.ఉత్తరాంధ్ర జిల్లాలకు జే. శ్యామల రావును, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్‌, పల్నాడు జిల్లాలకు బి.శ్రీధర్‌, గోదావరి సెక్టార్‌లో ఎన్‌.యువరాజ్‌ను, దక్షిణ కోస్తా జిల్లాల్లో పోల భాస్కర్‌ను, సీమ జిల్లాలకు డి.మురళీధర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఓటర్ల జాబితా పూర్తయ్యేలోగా వీళ్లంతా వారికి కేటాయించిన జిల్లాల్లో జనవరి 4లోగా మూడుసార్లు పర్యటిస్తారు. తొలి పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలతో పాటు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమవుతారు. ఓటరు జాబితా రూపకల్పనలో ఫిర్యాదులు, అభ్యంతరాలు తీసుకుంటారు. సాధారణ ప్రజలు కూడా రోల్‌ అబ్జర్వర్లను కలిసి ఫిర్యాదులు చేసేందుకు అవకాశం కల్పించింది ఎన్నికల సంఘం.ఉత్తరాంధ్ర జిల్లాల ప్రత్యేక పరిశీలకుడిగా నియమితులైన రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జె. శ్యామలరావు ఇప్పటికే డ్యూటీలో దిగేశారు. రెండు రోజులుగా ఆకస్మిక తనిఖీలు షురూ చేశారు. జాబితాలను, సంబంధిత రికార్డులను పరిశీలిస్తున్నారు. ఓట్ల తొలగింపు విషయంలో జాగ్రత్త వహించాలని, ఓటరు అంగీకారం తీసుకున్న తర్వాత మాత్రమే చర్యలు తీసుకోవాలని సూచించారు.ఇక, ఏపీలో రాజకీయ పార్టీలు కూడా అంతే స్పీడుగా సమాయత్తమవుతున్నాయి. అధికార పార్టీ వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇప్పటికే శంఖారావం ఊదేశారు. సామాజిక సాధికార యాత్ర పేరుతో బస్సులో తిరిగేస్తున్నారు అధికార పార్టీ నేతలు. ఫిబ్రవరిలో మేనిఫెస్టో రిలీజ్‌ చేస్తామని జగన్‌ ప్రకటించేశారు. రెగ్యులర్‌ బెయిల్‌ రావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా డిసెంబర్‌ మొదటి వారం నుంచి.. రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. లోకేష్‌ యువగళం యాత్ర కూడా రీస్టార్ట్‌ అయింది. ఈ ఆదివారాని కల్లా తెలంగాణ ఎన్నికల సందడి ముగిసిపోతుంది గనుక.. బీజేపీ, జనసేన కూడా ఏపీ విూద ప్రత్యేకంగా ఫోకస్‌ చేసే ఛాన్స్‌ ఉంది. విపక్షాల పొత్తుపై నెలకొన్న సందేహాలు కూడా తీరిపోతాయ్‌.ఓటర్ల జాబితా తుదిదశకు చేరుకోవడం, ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడం, రాజకీయ పార్టీలు కాంపైనింగ్‌లో జోరు పెంచడం.. అన్నీ ఒకేసారి జరగడంతో ఏపీలో ఎన్నికల హడావుడి షురూ అయ్యినట్టయింది. మార్చిలోనే ఏపీలో బిగ్‌ షో గ్యారంటీ అనే క్లారిటీ కూడా వచ్చేస్తోంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *