విజయవాడ, నవంబర్‌ 20: స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులో మాజీ సీఎం, టీడీపీ అదినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. ఆయనకు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అనారోగ్య కారణాలతో ఈ కేసులో ఇప్పటికే మధ్యంతర బెయిల్‌ పై ఉన్న ఆయనకు పూర్తి బెయిల్‌ మంజూరు చేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లికార్జున్‌ రావు తీర్పు వెలువరించారు. ఈ నెల 28న చంద్రబాబు రాజమహేంద్రవరం జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. మధ్యంతర బెయిల్‌ మంజూరు సమయంలో విధించిన షరతులు ఈ నెల 28 వరకే వర్తిస్తాయని, 29 నుంచి రాజకీయ ర్యాలీలు, సభలు, ప్రెస్‌ విూట్లలో చంద్రబాబు పాల్గొనవచ్చని న్యాయమూర్తి తెలిపారు. అయితే, ఈ నెల 30న ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరు కావాలని ఆదేశించారు. చికిత్సకు సంబంధించిన నివేదికను ఏసీబీ కోర్టులో అందించాలని సూచించారు. సెప్టెంబర్‌ 9న స్కిల్‌ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్‌ చేయగా పలుమార్లు బెయిల్‌ పై విచారణలు వాయిదా పడ్డాయి. అనంతరం, అనారోగ్య కారణాల రీత్యా ఆయనకు చికిత్స కోసం అక్టోబర్‌ 31న 4 వారాల మధ్యంతర బెయిల్‌ హైకోర్టు మంజూరు చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం చంద్రబాబు షరతులతో కూడిన బెయిల్‌ పై బయట ఉండగా పూర్తి బెయిల్‌ మంజూరైంది.
ఎప్పుడెప్పుడు ఏం జరిగిందంటే.?
స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసులో చంద్రబాబు హయాంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ఏపీ సీఐడీ సెప్టెంబర్‌ 9న ఆయన్ను అరెస్ట్‌ చేసింది. అదే రోజు ఏసీబీ కోర్టు రిమాండ్‌ విధించింది.
సెప్టెంబర్‌ 22 వరకూ రిమాండులో ఉన్న చంద్రబాబును, 2 రోజుల పాటు సీఐడీ కస్టడీకి అప్పగించారు. అనంతరం సెప్టెంబర్‌ 24న మరోసారి బాబుకు రిమాండ్‌ విధించిన కోర్టు అక్టోబర్‌ 5 వరకూ దాన్ని కొనసాగించింది.
అనంతరం విచారణ అనంతరం అక్టోబర్‌ 19 వరకూ చంద్రబాబుకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ ను ఏసీబీ న్యాయస్థానం పొడిగించింది.
అనంతరం అనారోగ్య కారణాల దృష్యా అక్టోబర్‌ 31న చంద్రబాబుకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. సుమారు 4 వారాల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన న్యాయస్థానం, నవంబర్‌ 24న సాయంత్రం చంద్రబాబు సరెండర్‌ కావాలని ఆదేశించింది. ఆయనకు అందించిన వైద్యం వివరాలను నివేదికలో సమర్పించాలని ఆదేశించింది.
స్కిల్‌ కేసులో సీఐడీ ప్రధాన ఆరోపణలివే
2014 ? 19లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యూనివర్సిటీలు, ఇంజినీరింగ్‌ కాలేజీలు కలిపి మొత్తం 40 చోట్ల ‘స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు’ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అందుకోసం రూ.3,611.05 కోట్లతో సీమెన్స్‌, డిజైన్‌టెక్‌ సంస్థలతో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఒప్పందం కుదుర్చుకుంది. సీమెన్స్‌, డిజైన్‌ టెక్‌ సంస్థ గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద 90 శాతం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులు సమకూర్చాలి. ఈ మేరకు 2017 జూన్‌ 30న జీవో 4ను టీడీపీ ప్రభుత్వం జారీ చేసింది. కానీ జీవో 4కు విరుద్ధంగా ఒప్పందం చేసుకునేలా ఏపీఎస్‌ఎస్‌డీసీ డైరెక్టర్‌గా ఉన్న రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కె.లక్ష్మీ నారాయణ, ఎండీ?సీఈవోగా ఉన్న గంటా సుబ్బారావు చక్రం తిప్పారని సీఐడీ ఆరోపించింది. రూ.100 స్టాంప్‌ పేపర్‌పై ఒప్పందం చేసుకున్నారు. అందులో తేదీ కూడా వేయలేదని సీఐడీ చెప్పింది. రూ.3,611.05 కోట్ల విలువ మేరకు కాంట్రాక్టును ఎలా నిర్ధారించారన్నదీ కూడా లేదని సీఐడీ చెబుతోంది. సీమెన్స్‌, డిజైన్‌ టెక్‌ సంస్థలు సమకూర్చాల్సిన 90 శాతం నిధులను ఏ విధంగా లెక్కించారన్నదీ చెప్పనే లేదు. సంబంధిత మొత్తం వేయాల్సిన చోట ఖాళీగా వదిలేశారని సీఐడీ ఆరోపించింది. జీవో ప్రకారం 90 శాతం నిధులు వెచ్చించాలన్న విషయాన్ని సీమెన్స్‌, డిజైన్‌ టెక్‌ కంపెనీలు పట్టించుకోలేదు. అయినా సరే ప్రభుత్వం మాత్రం తన వాటాగా చెల్లించాల్సిన 10 శాతం నిధులను జీఎస్టీతో సహా మొత్తం రూ.371 కోట్లు చెల్లించేసింది. అసలు పనులు చేయకుండానే నిధులు ఎలా చెల్లిస్తారని అప్పటి ఆడిట్‌ అకౌంటెంట్‌ జనరల్‌ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసినా సరే చంద్రబాబు ప్రభుత్వం పట్టించు కోలేదని సీఐడీ ఆరోపించింది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *