తిరుమల, ఆగస్టు 30: తిరుమల శ్రీవారి లడ్డూలపై తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూ జారీ విధానంలో మార్పులను తీసుకొచ్చింది, ఆధార్‌ కార్డు చూపిస్తేనే లడ్డూలు జారీ చేయాలని నిర్ణయించింది.టీటీడీ కొత్త రూల్స్‌ ప్రకారం?. శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు దర్శన టికెట్‌పై ఒక్క లడ్డూను మాత్రమే ఇవ్వనున్నారు. అంతకు ముందు దర్శన టోకెన్‌పై ఒక భక్తునికి రెండు లడ్డూలు ఇచ్చేవారు. ప్రస్తుతం మాత్రం ఒక్క లడ్డూనే ఇవ్వనున్నారు. ఇక అదనపు లడ్డూలు కావాలంటే ఆధార్‌ కార్డును చూపించాల్సి ఉంటుంది.టీటీడీ తాజా నిర్ణయంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహా ఆంక్షలు సరికాదని అంటున్నారు. ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా ఈ విధానం అమలు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. లడ్డూ ఆంక్షలపై టీటీడీ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.ప్రతి శనివారం తిరుపతి అర్బన్‌, తిరుమల స్థానికులకు కేటాయిస్తున్న 250 శ్రీవారి ఆలయ అంగప్రదక్షిణ టికెట్లు, ఇకపై లక్కీడిప్‌ ద్వారా కేటాయించనున్నట్లు బుధవారం టిటిడి ఒక ప్రకటనలో తెలిపింది.అంగప్రదక్షిణ టికెట్లు కావలసిన భక్తులు గురువారం వరకు తమ ఆధార్‌ కార్డుతో ఆన్‌ లైన్‌ లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని టీటీడీ తెలిపింది. వీరికి సాయంత్రం 5 గంటలకు లక్కీడిప్‌ ద్వారా టికెట్లు కేటాయించబడుతుంది. లక్కీడిప్‌ లో టికెట్లు పొందిన భక్తులకు వారి మొబైల్‌ ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌ రూపంలో సమాచారం అందిస్తూ, ఆన్‌ లైన్‌ లో ఉంచబడుతుందని పేర్కొంది.లక్కీడిప్‌ లో టికెట్లు పొందిన భక్తులు ఆన్లైన్‌ లో రూ.500 డిపాజిట్‌ చేయవలసి ఉంటుంది. లక్కీ డిప్‌ లో టికెట్లు పొందిన భక్తులు మహతి కళాక్షేత్రంలో తమ ఆధార్‌ కార్డు చూపి శుక్రవారం మధ్యాహ్నం 2 నుండి రాత్రి 8 గంటల వరకు అంగప్రదక్షిణ టికెట్లు పొందవచ్చు.లక్కీ డిప్‌ లో టికెట్లు పొందిన భక్తులను శనివారం తెల్లవారుజామున అంగప్రదక్షిణకు అనుమతిస్తారు. అనంతరం భక్తులు చెల్లించిన రూ.500 డిపాజిట్‌ ను తిరిగి వారి ఖాతాల్లోకి టీటీడీ జమ చేస్తుందని టీటీడీ వెల్లడిరచింది.తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్‌ 4 నుంచి ప్రారంభం కానున్నాయి. 12వ తేదీతో ముగిస్తాయి. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టీటీడీ వైద్య విభాగం ఆధ్వర్యంలో నూతనంగా 8 ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.ఇప్పటికే తిరుమల, తిరుపతిలలో శాశ్వతంగా ఆరు డిస్పెన్సరీలు, ఆరు ప్రథమ చికిత్స కేంద్రాలలో భక్తులకు, ఉద్యోగులకు, స్థానికులకు టీటీడీ వైద్య సేవలు అందిస్తోంది.బ్రహ్మోత్సవాలలో లక్షలాదిగా విచ్చేసే భక్తుల సౌకర్యార్థం అదనంగా తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో రెండు, రాంబగీచ అతిథి గృహాలు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రము, శిలా తోరణం, బాట గంగమ్మ ఆలయము, పాపానాశనం, 7వ మైలు వద్ద ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేయనున్నారు.ఇందుకోసం టిటిడి వైద్య విభాగం ఆధ్వర్యంలో ప్రముఖ డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బంది, మందులు, అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన అంబులెన్స్‌ లు సిద్ధం చేసుకుంటున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *