తాడేపల్లిగూడెం: బడా కార్పొరేట్ కంపెనీల లాభాలలో శ్రమజీవులకు న్యాయమైన వాటా దక్కే వరకూ పోరాటాలు సాగించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.సోమసుందర్ పిలుపు ఇచ్చారు.సెప్టెంబర్ 1,2,3, తేదీల్లో విశాఖపట్టణంలో జరగనున్న ఎఐటియుసి జాతీయ సమ్మేళనాల పోస్టర్ ను సోమవారం విడుదల చేసారు.ఈ సందర్భంగా డి.సోమసుందర్ మాట్లాడుతూ విశాఖపట్టణంలో జరిగే జాతీయ సమ్మేళనంలో కార్మికవర్గానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చిస్తారని, కార్పొరేట్ కంపెనీల సంపదను పునః పంపిణీ చేయాలన్న డిమాండ్ పై భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తారని అన్నారు.ఏఐటీయూసీ ఏరియా కమిటీ అధ్యక్షుడు ఓసూరి వీర్రాజు మాట్లాడుతూ కార్మిక హక్కులను హరిస్తున్న నాలుగు కార్మిక కోడ్లు రద్దుచేయాలని, విశాఖ ఉక్కు సహా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రతిపాదనలు విరమించాలని, విశాఖ ఉక్కు కర్మాగారానికి క్యాప్టీవ్ గనులను కేటాయించాలని , సాగిస్తున్న పోరాటాలను ఉధృతం చేయడానికి విశాఖ సమావేశాల్లో నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. ఏరియా కమిటీ కార్యదర్శి మందలపర్తి హరీష్ మాట్లాడుతూ విశాఖలో మూడో తేదీ జరగనున్న బహిరంగ సభకు కార్మికులు తరలిరావాలని కోరారు.సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళింగ లక్ష్మణరావు, మునిసిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి తాడికొండ శ్రీనివాసరావు, భవన నిర్మాణ కార్మికసంఘం జిల్లా కార్యదర్శి పోలిరాతి ఆదినారాయణ తదితరులు మాట్లాడుతూ విశాఖ సమ్మేళనాలను విజయవంతం చేయాలని కోరారు.కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికసంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు కోడే సాయి బాలాజీ, ఏఐటీయూసీ ఏరియా కమిటీ ఉపాధ్యక్షుడు మేళం నాగరాజు, కోశాధికారి కే. చంద్రరావు , అనుబంధం యూనియన్ నాయకులు సత్తిసెట్టీ అప్పలరాజు , కర్రి వీర వెంకట సత్యనారాయణ, కే.కాటమ రాజు, ఉప్పాటి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.